మే 15 లేదా 16న ఐపీఎల్ పునఃప్రారంభం...?

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా సద్దుమణగడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు బీసీసీఐ చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే, మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ఐపీఎల్ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం... పంజాబ్ కింగ్స్ జట్టు మినహా మిగిలిన అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు మే 13వ తేదీలోగా తమ తమ సొంత వేదికల్లో (హోం గ్రౌండ్స్‌లో) రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఫ్రాంచైజీలకు మౌఖికంగా సూచించింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను పునఃప్రారంభించేందుకు వీలుగా త్వరలోనే నూతన షెడ్యూల్‌ను రూపొందించనున్నట్లు బోర్డు ఫ్రాంచైజీలకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో, తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను వెంటనే సమర్పించాలని కూడా కోరింది. దీంతో ఫ్రాంచైజీలు తమ విదేశీ క్రికెటర్లను తిరిగి భారత్‌కు రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

మే 13 నాటికి అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే, ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం మే 25వ తేదీనే ఐపీఎల్ 2025 సీజన్‌ను ముగించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందుకోసం మిగిలి ఉన్న 12 లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్ల పద్ధతిలో వేగంగా పూర్తి చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించి, ఆ జట్టు మ్యాచ్‌లను ఒక తటస్థ వేదికపై నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఆ వేదికను ఖరారు చేయాల్సి ఉంది.

పంజాబ్ జట్టుకు హోమ్ గ్రౌండ్ మొహాలీ కాగా, ఇది పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ మ్యాచ్ లు జరపడం శ్రేయస్కరం కాదని బీసీసీఐ భావిస్తోంది.


BCCI
IPL 2025
IPL Resumption
Indian Premier League
Cricket
India Pakistan Border Tension
Punjab Kings
Mohali
IPL Schedule
Double Headers

More Telugu News